జాతీయ రహదారులపై ఐదు రాష్ట్రాల గుత్తాధిపత్యం.. ఈ గణాంకాలే నిదర్శనం

జాతీయ రహదారులపై టోల్ చార్జీ వసూలు రూపంలో కేంద్రానికి భారీ ఆదాయం సమకూరుతోంది. 2022-23లో రూ.48,028 కోట్ల ఆదాయం కేంద్రానికి లభించింది. ఈ గణాంకాలను మరింత లోతుగా పరిశీలించి చూస్తే.. దేశవ్యాప్తంగా ఈ టోల్ వసూలు మధ్య సారూప్యత కనిపించడం లేదు. కేవలం ఐదు రాష్ట్రాల పరిధిలోని జాతీయ రహదారుల నుంచే భారీ ఆదాయం సమకూరినట్టు అర్థమవుతుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారుల నుంచి గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.5,583 కోట్ల ఆదాయం సమకూరింది. రాజస్థాన్ లోని రహదారుల నుంచి రూ.5,084 కోట్ల ఆదాయం వచ్చింది. మహారాష్ట్రలోని జాతీయ రహదారుల నుంచి టోల్ రూపంలో రూ.4,660 కోట్లు, గుజరాత్ నుంచి రూ.4,519 కోట్లు, తమిళనాడు నుంచి రూ.3,817 కోట్ల చొప్పున ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం అనే కాదు, గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లోనూ జాతీయ రహదారుల టోల్ చార్జీల ఆదాయంలో ఈ ఐదు రాష్ట్రాల వాటానే గణనీయంగా ఉంటోంది. గుజరాత్ లో 6,635 కిలోమీటర్లు, తమిళనాడులో 6,742 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారులు ఉన్నాయి.

జాతీయ రహదారిపై సగటున ఒక కిలోమీటర్ నుంచి వస్తున్న టోల్ చార్జీ పరంగా చూస్తే.. హర్యానాలో అత్యధికంగా 79 రూపాయలు, పశ్చిమబెంగాల్ లో రూ.71.47, గుజరాత్ లో రూ.68, తమిళనాడులో రూ.56.62, రాజస్థాన్ లో రూ.49 చొప్పున ఉంది. తెలంగాణలో సగటున ఒక కిలోమీటర్ జాతీయ రహదారి నుంచి రూ.48.12 టోల్ చార్జీ వసూలు అవుతుంటే, ఏపీలో ఇది రూ.47.35గా ఉంది.

Toll charges
national highways
five states
top collection

More Telugu News